Posts Tagged ‘Reason Romanticism and Revolution’

వివేచన, ఉద్వేగవాదం, విప్లవం – ఎమ్.ఎన్.రాయ్

March 5, 2013

బొమ్మ

మానవేంద్రనాథ్ రాయ్ (ఎమ్.ఎన్.రాయ్) తన జీవితంలో చివరి దశలో రాసిన బృహత్తర తాత్విక చింతనాగ్రంథం ఇది. రెండు భాగాలుగా వెలువడిన ఈ రచన సమగ్ర మానవవాద తాత్విక చింతనగా పేర్కొనవచ్చు. 1952లో రాయ్ ఈ గ్రంథాన్ని పూర్తి చేశారు. ఇది వెలువడగానే పాశ్చాత్య లోకంలో మేథావులను ఆకట్టుకున్నది. సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎరిక్ ఫ్రాం (ERICH FROMM) దీనిపై అభిప్రాయం వెల్లడిస్తూ యూరోప్ లో జరిగిన పునర్వికాసాన్ని విప్లవ చరిత్రను అవగాహన చేసుకోవడానికి ఎమ్.ఎన్.రాయ్ రచన చదవమని తన గ్రంథం ‘సేన్ సొసైటీ’ లో స్పష్టీకరించారు.

గ్రంథ విస్తరణ వలన దీనిని రెండు భాగాలుగా ప్రచురించారు. మొదటి భాగంలో మానవ స్వభావం, నియమబద్ధ ప్రకృతి, మానవుడి తిరుగుబాటు, ఎదురు తిరిగిన దేవతలు, ప్రకృతి నియమం, ఆధునిక తత్వం పుట్టుక కొత్త విజ్ఞానం, జ్ఞాన వికాసం, మహోన్నత విప్లవం ఉన్నాయి. పరిపక్వత చెందిన తాత్విక శాస్త్రజ్ఞుడుగా ఆధునిక చరిత్రను విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తిగా ఎమ్.ఎన్.రాయ్ ఈ రచనలో కనిపిస్తారు. ఆయన భాషా శైలి కూడా విషయానికి తగ్గట్టే ఉంటుంది.

మానవ స్వభావాన్ని గురించి మతపరమైన చర్చలు అనాదిగా సాగుతుండగా ఎమ్.ఎన్.రాయ్ ఆధునిక విజ్ఞానం ఆధారంగా మానవుడు ప్రాయికంగా స్వేచ్ఛా ప్రియుడని సహకార జీవి అని తేల్చి చెప్పాడు. స్వభావాన్ని కప్పిపుచ్చే హేతురహిత నమ్మకాలు అడ్డు వస్తున్నాయని వాటిని తొలగించి అసలైన మానవ స్వభావాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలంటాడు రాయ్.

ప్రకృతిలోనే నియమబద్ధత ఉన్నదని కార్యకారణ సంబంధం అందులో అడుగడుగున కన్పిస్తున్నదని వాటిని తెలుసుకోవటానికి సైన్సు బాగా ఉపకరిస్తున్నదని చెప్పారు. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా మానవుడిని నమ్మకాల కట్టుబాట్లలో బంధించిన ఆలోచనా రీతులను, యూరోప్ లో మొట్టమొదటిసారిగా తాత్విక చింతనాపరులు ఎదిరించి మానవుడుగా నిలదొక్కుకోవడానికి తోడ్పడ్డారు. ఆ విషయాలను సోదాహరణగా ఆయా తాత్వికుల రచనల ద్వారా రాయ్ ఈ గ్రంథంలో చూపారు. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ తదితర దేశాలలో వచ్చిన తాత్విక చింతనలు శాస్త్రీయ పరిణామాలు మానవుడికి బాగా తోడ్పడ్డాయి. మధ్యయుగాల నుండే బయటపడిన ఈ దేశాలు ఆధునికతలోకి ప్రవేశించి నాగరికతను విప్పారజేశాయి. అక్కడే ఆధునిక తత్వం పుట్టింది. డేకార్ట్, డిడరో, రూసో, వోల్టేర్, స్సినోజా, కాంట్, హెగల్, నిషే మొదలైనవారెందరో తాత్విక రంగంలో చొచ్చుక పోయి మానసిక బంధాలను తెంచారు. వాటిని రాయ్ చూపిన తీరు ఎలా పరిణితి చెందినదో కన్పిస్తుంది. ఒకవైపున పారిశ్రామిక రంగం, మరొకవైపు శాస్త్రీయ పరిశోధనలు, ఇంకోపక్క సాహిత్యంలో పునర్వికాసం అన్నీ మేళవించుకుని కొత్తదారులు తొక్కాయి. అందువలన యూరోప్ లో మహోన్నత విప్లవానికి పరిస్థితులు దారితీశాయి. ఫ్రాన్స్ దీనికి గంట కట్టింది. విజ్ఞాన సర్వస్వం మనుషులకు ఆయుధంగా లభించింది. మానసిక సంకెళ్ళు తెంచుకోవటానికి ఇవన్నీ ఉపకరించాయి. విషయం బరువైనది. కాని చెప్పిన తీరు ఆకర్షణీయమైనది. అందుకే ఇది గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలను ఆకట్టుకున్నది.

ఈ పుస్తకం వెలువడిన కొత్తలోనే ప్రపంచ మానవవాద సంఘం ఆమ్ స్టర్ డాంలో ప్రారంభమైంది. ఎమ్.ఎన్.రాయ్ ను దానికి ఉపాధ్యక్షుడుగా పరోక్షంగానే ఎన్నుకున్నారు. జూలియన్ హక్సలీ వంటి ప్రపంచ శాస్తజ్ఞులు రాయ్ ఆలోచన పట్ల దృష్టి సారించారు. ఆవిధంగా ఈ గ్రంథం చరిత్రలో నిలదొక్కుకున్నది. ఈ పుస్తకాన్ని 1986లో తెలుగులోకి ఎన్. ఇన్నయ్య తీసుకువచ్చారు.

ఈ గ్రంథ రచయిత ఎమ్.ఎన్.రాయ్, తొలిపేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. నేటి పశ్చిమ బెంగాల్ లో 1887లో పుట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తీవ్రవాద జాతీయ రాజకీయాలలో పాల్గొని జర్మనీ సహాయంతో బ్రిటీష్ వారిని పారద్రోలాలని విదేశాలకు వెళ్ళారు. ఆ ప్రయాణంలో అమెరికాకు చేరుకుని యూనివర్సిటీలో ఎవిలిన్ ట్రెంట్ ను కలిసి ఆమెను పెళ్ళి చేసుకుని మెక్సికో వెళతారు. అక్కడ తొలిసారిగా రష్యా వెలుపల కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన ఘనత రాయ్ దే. అది లెనిన్ దృష్టికి రాగా వారి ఆహ్వానంపై మాస్కో వెళ్ళి ప్రపంచ కమ్యూనిస్టు రాజకీయాలలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. తాష్కెంట్ లో ప్రవాస భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించారు. తరువాత కమ్యూనిస్టు నాయకులతో భేదించి 1930లో ఇండియాకు తిరిగి రాగా బ్రిటిష్ వారు అరెస్టు చేసి ఆరేళ్ళు జైలులో వుంచారు. విడుదలైన తరువాత కొద్ది రోజులు కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొని 1940 నాటికి రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. పార్టీ రాజకీయాలు తప్పని తెలుసుకొని 1948లో పార్టీని రద్దు చేసి పునర్వికాస ఉద్యమాన్ని ప్రారంభించారు. 1955లో మరణించారు. ఐన్ స్టీన్ వంటి శాస్త్రజ్ఞులతో పరిచయంగల రాయ్ ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలు అద్భుతంగా రాశారు. ఎన్నో పత్రికలు నడిపారు. వందకు పైగా చిన్నా పెద్దా పుస్తకాలు రాశారు. దేశంలో అనేకమందికి శాస్త్రీయ ధోరణిలో రాజకీయాలు నేర్పారు. లెనిన్, స్టాలిన్, డ్రాటస్కీ, మావో, చౌఎన్ లై వంటి అగ్ర నాయకులతో వ్యవహరించారు.

ఎమ్.ఎన్.రాయ్ రచనలు ప్రధానమైనవన్నీ ఎన్.ఇన్నయ్య తెలుగులోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని దిగువ ఇచ్చిన గొలుసులలో  దిగుమతి చేసుకొనండి లేక చదవండి.

తెలుగు అనువాద పుస్తకం భాగం-1 కై ఇక్కడ నొక్కండి. భాగం-2 కై ఇక్కడ నొక్కండి.

ఆంగ్ల పుస్తకం Reason, Romanticism and Revolution కై ఇక్కడ నొక్కండి.